జలధార – జలహారతి వేగంగా పూర్తిచేయాలి*
*జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి*
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 13. ( (పున్నమి ప్రతినిధి )
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార – జల హారతి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ పనుల పురోగతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 8,995 పనులను గుర్తించి, మంజూరు చేయడం జరిగిందనీ చెప్పారు. క్షేత్రస్థాయిలో 8,991 పనులను ప్రారంభించగా, అందులో 8,973 పనులు ఇప్పటికే పూర్తి చేయబడ్డాయనీ తెలిపారు. ఈ పనుల కోసం మొత్తం రూ. 318.57 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా స్థానిక ప్రజలకు భారీ స్థాయిలో 1.28 కోట్ల పని దినాల ఉపాధి లభించిందనీ చెప్పారు. పనులను డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో జరిగిన పనుల వివరాలను పరిశీలిస్తే, 109.90 లక్షల ఘనపుటడుగుల పూడిక తొలగించడమే కాకుండా, 82.48 లక్షల చదరపు మీటర్ల మేర జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారని తెలిపారు. అలాగే, 2,090 కిలోమీటర్ల మేర కాలువలలో పూడిక తీయడం ద్వారా నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. ఈ భారీ కసరత్తు ఫలితంగా భూగర్భ జలాల పునరుద్ధరణపై సానుకూల ప్రభావం కనిపిస్తోందన్నారు. దీని ద్వారా మొత్తం 0.600 టీఎంసీ ల అదనపు భూగర్భ నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు మరింత మేలు జరుగుతుందని, జిల్లాలో జల సంరక్షణకు ఈ కార్యక్రమం పెద్దపీట వేసిందని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి వివరించారు.
ఈ వీసీలో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, డ్వామా పిడి శారదాదేవి, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ అధికారులు పాల్గొన్నారు.



