సంగం మండలం కొరిమెర్ల గ్రామానికి చెందిన నాగవరపమ్మ ఆలయం ధర్మకర్త చెన్నై లో స్థిరపడిన వడ్లమాని చిన్న కొండస్వామి నాయుడు చెన్నై తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.గత 25 సంవత్సరాలుగా చెన్నైలో నివసిస్తూ, రాష్ట్రాలు దాటినా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, తెలుగు ప్రజల ఐక్యత కోసం విశేషంగా సేవలందిస్తున్న ఆయన సేవలను గుర్తించి చెన్నై తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యుడిగా నియమించింది.పురిటిగడ్డను వదిలి పొరుగు రాష్ట్రంలో స్థిరపడినా, మాతృభాషపై మమకారాన్ని చంపుకోలేదు ఆ తెలుగు బిడ్డలు. అరవ భూమిలో తెలుగు తనాన్ని కాపాడుకుంటూ, మన సంస్కృతీ సాంప్రదాయాల పరిమళాన్ని పంచుతున్న ‘చెన్నై తెలుగు అసోసియేషన్’ నూతన కార్యవర్గాన్ని 2026–28 సంవత్సరాల కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చెన్నై తెలుగు అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు గా వెంకటగిరి కి చెందిన ఆర్.వి. రమణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షుడి తో పాటు ,కమిటీ సభ్యులు అయిన వి.సి. కొండస్వామి నాయుడిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తనవంతు కృషి కొనసాగిస్తానని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్నేహితులు, గ్రామస్థులు వడ్లమాని చిన్న కొండస్వామి నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.



