భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి):
కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రపంచ బ్యాంకు రుణం కోసం డీపీఆర్ తయారీకి పిలిచిన టెండర్ను రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీపీఆర్ తయారీ కోసం పిలిచిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

