బిక్కవోలు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలులో అసంపూర్తిగా ఉన్న కాపు కళ్యాణ మండపం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.25 లక్షల నిధులు మంజూరు చేసిన సందర్భంగా బిక్కవోలు గ్రామ కాపు సంఘం నాయకులు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రామవరంలో కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బిక్కవోలు టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు పాటి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి అభినందించారు.
2019లో అధికారంలో ఉన్న సమయంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రస్తుతం మరోసారి మండపం అభివృద్ధి కోసం కాపులపై ఉన్న అభిమానంతో రూ.25 లక్షలు మంజూరు చేయడం పట్ల కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాపులందరి తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కాపు కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించాలని తమ సంఘం పెద్దలు కోరుకుంటున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపం పూర్తయితే గ్రామంలోని కాపు కుటుంబాలకు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.



