భూపాలపల్లి, ఆగస్టు 20: (పున్నమి ప్రతినిధి):
భూపాలపల్లిలోని ఎస్ ఆర్ డి జి స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మంచి నాయకుడికి క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించే గుణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి లక్షణాలు ఎంతో అవసరమని తెలిపారు. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమే నిజమైన నాయకత్వమని విద్యార్థులకు సూచించారు.
అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు అధికారికంగా సాష్లు (Sashes) ధరింపజేసి, వారి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను పెంపొందించేలా ఉత్సాహభరితంగా సాగింది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని నూతన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు.


