*ఎరువుల కోసం రైతులకు తప్పని తిప్పలు..!*
*ఏన్కూరు మండలంలో గంటల తరబడి ఆన్లైన్ బుకింగ్ కోసం ఎదురుచూపులు*
*క్షణాల్లోనే బ్యాగులు బుక్ చదువురాని రైతులకు మరింత ఇబ్బందులు*
*అధికారులకు కూడా తప్పని తిప్పలు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
మండలంలో ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులను పక్కన పెట్టి గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ బుకింగ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మండలానికి కేటాయించిన సుమారు 450 బ్యాగుల ఎరువులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన క్షణాల్లోనే బుక్ అయిపోతుండటంతో అనేక మంది రైతులకు నిరాశే మిగులుతోంది.
ఆన్లైన్ సేవలు, యాప్ వినియోగంపై అవగాహన ఉన్న రైతులు కొంతవరకు ప్రయత్నించగలుగుతున్నప్పటికీ, చదువుకోని, స్మార్ట్ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమయానికి ఎరువులు అందకపోవడంతో పంటల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
భూమి వారి పేరున లేకపోవడంతో ఎరువులు పొందేందుకు పట్టాదారు రైతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. రోజుల తరబడి ఎరువుల కోసం తిరుగుతున్నా సకాలంలో అందకపోవడంతో రైతుల్లో అసంతృప్తి పెరుగుతోంది.
“ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం అయినా దొరుకుతుందేమో కానీ ఎరువులు మాత్రం దొరకడం లేదు. ఎరువులకు ఉన్న డిమాండ్ బంగారానికి కూడా లేదు” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల కోసం రైతులు వ్యవసాయ పనులను వదిలి ఆన్లైన్ బుకింగ్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితిని ప్రభుత్వం పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు.
గతంలో మాదిరిగానే రైతులకు సులభంగా ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, యాప్ ఆధారిత విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రైతులకే కాకుండా ఎరువుల పంపిణీని పర్యవేక్షిస్తున్న అధికారులకు కూడా ఈ ఆన్లైన్ విధానం తిప్పలు తెచ్చిపెడుతోందని పలువురు పేర్కొంటున్నారు.
ఎరువుల కొరతను వెంటనే పరిష్కరించి రైతులకు సకాలంలో సరఫరా చేయకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.


