సత్తుపల్లి / ఖమ్మం
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీకి నల్ల టీషర్టులతో వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, కేటీఆర్, హరీశ్రావు తదితర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కని, ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారశైలిపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని సండ్ర డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్లో తులం బంగారం వంటి హామీలు అమలు చేయాలని కోరారు. అనంతరం ప్రజల నుంచి సేకరించిన సమస్యలపై వినతిపత్రాలను ప్రజావాణిలో అధికారులకు సండ్ర వెంకట వీరయ్య సమర్పించారు



