కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు రాష్ట్రంలో కేవలం తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఇవ్వడం వల్ల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగడం లేదని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో SIR గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సోమవారం ప్రొద్దుటూరు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీజే నాయకులు మాట్లాడుతూ, ఒక్కో బీఎల్ఎ పరిధిలో వెయ్యి నుంచి 1,600 వరకు ఓటర్లు ఉండటంతో ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం కష్టంగా మారిందన్నారు. ఇంకా 20 నుంచి 30 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాలు ప్రజలకు అందలేదని, ఫారాలపై ప్రజలతో పాటు బీఎల్ఎలకు కూడా పూర్తి అవగాహన లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు.
మ్యాపింగ్ సమస్యల కారణంగా అనేక ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడంతో పాటు, బీఎల్డీఓలు ఇప్పటివరకు సుమారు 40 నుంచి 50 శాతం వరకు మాత్రమే ఆన్లైన్ నమోదు పూర్తి చేశారని పేర్కొన్నారు. కొంతమంది బీఎల్ఎల వద్ద మ్యాపింగ్ పూర్తికాకపోవడంతో అనేక ఫారాలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో ఇప్పటివరకు కేవలం 1.56 కోట్ల మంది (37.66 శాతం) మాత్రమే ఫారాలు నింపి సమర్పించినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం, భారత ప్రభుత్వం పునరాలోచించి SIR గడువును కనీసం మరో నెల రోజుల పాటు పొడిగించాలని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీర్, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ భాషా, సభ్యులు ముక్తియార్, షఫీ అహ్మద్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గౌస్ లాజం తదితరులు పాల్గొన్నారు.


