నెల్లూరు జిల్లాలో లాడ్జిలు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు – పోలీసులు పటిష్ఠంగా చర్యలు
నెల్లూరు జిల్లాలో లాడ్జిలు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు – పోలీసులు పటిష్ఠంగా చర్యలు | నెల్లూరు | పున్నమి ప్రతినిధి జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా, నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారి సూచనలతో పోలీసులు 19.04.2025 న రాత్రి 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా, మొత్తం 96 లాడ్జిలను పోలీసులు పరిశీలించారు. ప్రతి గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, అక్కడ బస చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించి, వారి ప్రయాణ ప్రయోజనాలపై ఆరా తీశారు. లాడ్జిల యాజమాన్యానికి సూచనలు: అనుమానితుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్న సూచనలతో పాటు, లాడ్జిల పరిసరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. వాహన తనిఖీలు – కఠిన చర్యలు: జిల్లాలోని అన్ని కూడళ్ళు, హైవేలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు తరిఖీ చేయబడ్డాయి. మొత్తం 3100 వాహనాలు తనిఖీ చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మందిపై కేసులు నమోదు కాగా, 70 MV యాక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.43,080/- జరిమానాలు విధించారు. పౌరులకు సూచనలు: హెల్మెట్ ధరించడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జాతీయ రహదారులపై రాంగ్ రూట్లు వాడకూడదని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న సందేశం ఇచ్చారు. విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పటిష్ఠంగా అమలు చేయాలని యస్.పి. గారు సూచించారు.

