రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కు చెందిన లక్ష్మీనగర్(లిటిల్ ఏంజిల్స్ స్కూల్ ఏరియా)కు మౌళిక సదుపాయములు లేకపోవడంతో అక్కడి వారు నానా అవస్థలు పడుతున్నారు.గత దశాబ్ద కాలం పైగా మురుగునీటి కాలువలు ఇప్పటికీ లేకపోవడంతో దాదాపు 150 ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న మురుగునీరు వీధుల గుండా వస్తుండడంతో విధిలేక ఆ మార్గం లోనే ముక్కులు మూసుకొని తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎగుడు దిగుడు రోడ్లతో నిత్యం కుస్తీ పడుతున్నారు. కాస్తా వర్షం కురిసినప్పుడు ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుందని, బురదలో ప్రయాణించాలని కాలనీ వాసులు వాపోతున్నారు.ఈ సమయంలో మహిళలు వృద్ధులు చిన్న పిల్లలు పరిస్థితి వర్ణాతీతం అన్నారు.ఇటువంటి రోడ్లపై ద్విచక్ర వాహనాన్ని నడుపలేక బురదలో జారి పడిపోయిన సంఘటన లు అనేకంగా ఉన్నాయన్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు వీధులలో ఆడుకొనే పరిస్థితి లేదన్నారు.దీనికి తోడు పాములు, విష పురుగులు యధేచ్చగా ఇండ్లలో వచ్చేస్తున్నాయoటున్నారు.ఇంకనూ తమ కాలనీకి కొళాయి కనెక్షన్ లు,పైపు లైన్ లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇలా చెప్పుకొంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ మున్సిపాలిటీ ప్రాంతంలోనే వెనుకబడిన కాలనీగా ఉందని అక్కడి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక ఇప్పటికైనా తమ కాలనీ వాసులకు మునిసిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కలసి అత్యవసరoగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు విజయశేఖర్ రెడ్డి,ఆంజనేయులు, ఏ.ఆర్.కుమార్,సెంథిల్ కుమార్, వెంకటాచలం,హరి ప్రసాద్, ధనంజయులు, జిలానీ,కస్తూరి,చంద్రారెడ్డి,విజయ్ కుమార్, సుబ్రమణ్యం, శివమోహన్, బాలసుబ్రమణ్యం, సుధాకర్ ,మాధవ్,వాసుమూర్తి తదితరులు ముక్త కంఠంతో కోరుతున్నారు.











