నిజామాబాద్, సెప్టెంబర్ 7: బంగారు ఆభరణాల కోసం ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్నగర్లో చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు బంగారు కమ్మలను అపహరించేందుకు ప్రయత్నించాడు. అవి రాకపోవడంతో ఆమె చెవులకు కత్తెరతో గాయపరిచి కమ్మలను లాక్కెళ్లాడు.
స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధురాలి చెవుల నుంచి బంగారు కమ్మలను తీసేందుకు ప్రయత్నించాడు. కమ్మలు రాకపోవడంతో కత్తెరతో చెవులకు గాయపరిచి వాటిని బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి, గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి జరగడంతో గౌతమ్నగర్లో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.



