హౌస్ అరెస్టులు రేవంత్ సర్కార్ పిరికిపంద చర్య
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ‘చలో అసెంబ్లీ’కి వెళ్లకుండా బీజేపీ నాయకుల నిర్బంధం
విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం ఆగదు: బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి
ఖమ్మం: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘ఫీజులు బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయించడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారాపరాజు రామచందర్ రావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు పిలుపు మేరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.15 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
హౌస్ అరెస్టులు, పోలీసుల నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గుండా ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.



