సిద్ధవటం మండలం మందపల్లె (మంథవరం) ప్రాంతంలో గ్రీన్ హైవే పనుల పేరుతో అనుమతి లేని సర్వే నంబర్లో మట్టి తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించారని మాధవరం-1 గ్రామానికి చెందిన దళిత రైతులు ఆరోపించారు. 2013లో ప్రభుత్వం అసైన్మెంట్ కింద సుమారు 70 ఎస్సీ కుటుంబాలకు భూములు కేటాయించిందని తెలిపారు. గ్రీన్ హైవే కోసం సర్వే నంబర్లు 1171,1175లో మాత్రమే మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నప్పటికీ, సర్వే నంబర్ 1152/A1లో హిటాచీలు, టిప్పర్లతో తవ్వకాలకు ప్రయత్నించారని పేర్కొన్నారు.తమ సాగుభూముల్లో తవ్వకాలను అడ్డుకున్న మహిళలు, రైతులను కులం పేరుతో దూషించి బెదిరించారని బాధితులు ఆరోపించారు.ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు తమకు రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


