తిరుమల ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ .అవధాని ఆధ్వర్యంలో 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాగాలు, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగం చేపడుతున్నారు.12 మంది ఋత్వికులు గోగర్భం తీర్థంలో నడుము లోతు నీళ్లలో నిల్చుని వరుణ, పర్జన్య మంత్రాలను పఠించారు. అదేవిధంగా ఏడు వేద శాఖలకు చెందిన 14 మంది ఋత్వికులు రామాయణం, భాగవతం, మహాభారతం లోని విరాటపర్వం పారాయణం చేస్తున్నా రు.ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

