ఖమ్మం అభివృద్ధి మేము చేశామంటే మేము చేశామని చెప్పుకుంటున్న నాటి అధికార బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ నాయకుల మాటలకు వర్షాకాలంలోనే అసలు పరీక్ష ఎదురవుతోందని నగర ప్రజలు అంటున్నారు. వేసవి, చలికాలంలో కనిపించే అభివృద్ధి కంటే వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చేపట్టిన పనులే నిజమైన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ఫలితాలపై ప్రజల్లో చర్చ మొదలైంది. కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకోవడం కాదని, వర్షం పడినప్పుడు నీరు రోడ్లపై నిలవకుండా చూడగలిగితేనే అభివృద్ధి సాధించినట్లని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు నగరంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నారు.



