హైదరాబాద్ రన్–2026 సజావుగా నిర్వహణకు సమన్వయ సమావేశం
హైదరాబాద్: హైదరాబాద్ రన్–2026ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న 15వ ఎడిషన్ హైదరాబాద్ రన్–2026కు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాలుగు విభాగాల్లో నిర్వహించనున్న పరుగులపై అధికారులు సమీక్షించారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రన్, 5 కిలోమీటర్ల రన్ నిర్వహించనున్నారు.
21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభం కానున్నాయి. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగులు మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి ప్రారంభమై, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి వద్ద ముగియనున్నాయి.
సమావేశంలో ట్రాఫిక్ నిర్వహణ, రూట్ ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది బందోబస్తు, భద్రతా చర్యలు, పాల్గొనే వారి రక్షణతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడ్లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారులు సమీక్షించారు.
హైదరాబాద్ రన్–2026లో పాల్గొనే క్రీడాకారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కార్యక్రమం సజావుగా జరిగేలా నిర్వాహకులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సంక్రాంతి రవి కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–I) జి. హనుమంత రావు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–I) కె. చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్ సి ఎస్ సి సీఈఓ నవీద్ ఖాన్, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ అధికారులు, ఎన్ ఎం డి సి హైదరాబాద్ రన్నర్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


