తిరుపతిజిల్లా దొరవారిసత్రం:
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా దొరవారిసత్రంమండలానికి చెందిన ఎంపీఈవో వల్లిపి గ్రేస్ సముచిత గౌరవాన్ని అందుకున్నారు. గత 11 సంవత్సరాలుగా అనగా 2015 నుండి 2026వరకు ఆమె అందించిన నిరుపమాన సేవలను గుర్తిస్తూ, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావ్ గారి చేతులమీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక “ఉత్తమ ఎంపీఈవో” పురస్కారాన్ని స్వీకరించారు.
*నిబద్ధతకు దక్కిన సముచిత గౌరవం:*
వల్లిపి గ్రేస్ అందుకున్న ఈ అవార్డు కేవలం ఒక ప్రశంసాపత్రం మాత్రమే కాదు.క్షేత్రస్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దశాబ్ద కాలానికి పైగా చూపిన నిరంతర శ్రమకు, నిలకడైన నిబద్ధతకు దక్కిన ఘన సత్కారం. 2015లో విధి నిర్వహణలో చేరిన నాటి నుండి నేటి వరకు ఆమె ప్రస్థానం ఎంతో స్పూర్తిదాయకం. సచివాలయ వ్యవస్థ రాకముందు ఆమె దొరవారిసత్రం మండలమంతా విస్తృతంగా పనిచేసి రైతాంగానికి అండగా నిలిచారు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన కొత్తలో కొత్తపల్లి సచివాలయ పరిధిలో తన మార్కు సేవలను అందించారు. ప్రస్తుతం నెలబల్లి సచివాలయంలో ఎంపీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు సాంకేతిక, నైతిక మద్దతును అందిస్తూవస్తున్నారు.ఒక ఎంపీఈవోగా కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రతి చేనుకూ వెళ్ళి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో ఆమె చూపిన చొరవ అమోఘం. విత్తన శుద్ధి, చీడపీడల నివారణ, ఈ-క్రాప్ బుకింగ్ వంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు ను ప్రతి రైతుకూ పారదర్శకంగా చేర్చడంలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించారు.సాధారణ విధులతో పాటు రైతుల కోసం ప్రత్యేక క్యాంపైన్లను ఏర్పాటు చేసి, వారిని నేరుగా వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు తీసుకెళ్ళి అక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికతపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం.తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో, జిల్లా ఉన్నతాధికారులు మరియు వేలాది మంది ప్రజల సమక్షంలో జిల్లా వ్యవసాయ అధికారి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకోవడం దొరవారిసత్రం మండలానికే గర్వకారణం. విధి నిర్వహణలో అలసత్వం వహించే ఎంతోమందికి వల్లిపి గ్రేస్ ఒక దిక్సూచిలా, రోల్ మోడల్గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.


