పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 07): వేముల: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరరావు సూచించారు. వేముల మండలంలోని గొల్లలగూడూరు గ్రామంలో “పంటలపై ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనే విధానాలు” అంశంపై నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎల్నినో పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ (కాంటింజెన్సీ) పంటలు, స్వల్పకాలిక పంట రకాలు, నేల తేమ సంరక్షణ పద్ధతులు, వర్షాభావ పరిస్థితుల్లో పంటల నిర్వహణ, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే చర్యలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక వంటి అంశాలపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు.
అనంతరం వి.కొత్తపల్లి గ్రామంలో పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే యాజమాన్య పద్ధతులు, నేల తేమ సంరక్షణ చర్యలు, ఆలస్యంగా రుతుపవనాలు ప్రారంభమైన పరిస్థితుల్లో సాగు చేయదగిన ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంట రకాలపై సూచనలు అందించారు.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను పాటిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని, నేలలో తేమను సంరక్షించే శాస్త్రీయ పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులతో పరస్పర చర్చలు నిర్వహించి వారి సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారు. ఈ కార్యక్రమం ఎల్నినో పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ నిర్వహణపై రైతుల్లో అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ఉటుకూరు శాస్త్రవేత్తలు డా. ప్రభాకర్ రెడ్డి, డా. సునీల్ కుమార్, డా. మాధురి, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్, కోరమాండల్ ఎరువుల కంపెనీ సీనియర్ ఆగ్రానోమిస్ట్ నర్సిరెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ శివారెడ్డి, ఆగ్రానోమిస్ట్ మహేశ్వర్ రెడ్డి, పులివెందుల సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు, వ్యవసాయ కళాశాల పులివెందుల సహాయ ఆచార్యులు డా. బాలచంద్ర, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ఇంతియాజ్, లక్ష్మీదేవి తదితరులు, రైతులు పాల్గొన్నారు.




