అనపర్తి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మైనర్ డ్రెయిన్లో నీటి ఉద్ధృతి పెరగడంతో డ్రెయిన్ గట్లు నీటమునిగి సమీప పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, నీటి ప్రవాహాన్ని నియంత్రించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు పాల్గొన్నారు. అలాగే అనపర్తి టౌన్ కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై స్థానిక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.



