హైదరాబాద్, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ప్రతినిధి):
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సమర్థంగా పనిచేయడంతో పాటు భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని పేర్కొన్నారు.
అయితే జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం తక్కువగా ఉండేలా ఈ షెడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు.
ప్రజలు తమ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించిన ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, జూన్ 29 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. శాఖ చేపడుతున్న నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

