గాజువాక, (పున్నమి ప్రతినిధి): సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ చారిటబుల్ సొసైటీ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గాజువాక బీసీ రోడ్డులోని స్వామి ఫంక్షన్ హాల్లో ఆదివారం రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల్లో నిస్వార్థ సేవలందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమాజ సేవలో విశిష్ట సేవలందిస్తున్న సంస్థల ప్రతినిధులను వేదికపై గౌరవించి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా “మానవ సేవే మాధవ సేవ” అనే సిద్ధాంతంతో నిరుపేదలకు అండగా నిలుస్తూ, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహాత్మా మదర్ తెరిసా ట్రస్ట్ వ్యవస్థాపకుడు జాగరపు శ్రీనును సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ చారిటబుల్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. దుశ్శాలువాతో కప్పి, జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ చారిటబుల్ సొసైటీ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు




