ఖమ్మం, జూన్
(పున్నమి జిల్లా ప్రతినిధి: పువ్వాడ నాగేంద్ర కుమార్):
ఖమ్మం పట్టణంలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గౌస్ పాషాపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ డిమాండ్ చేశారు.
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక లకారం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ, బాధిత బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటనే హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన అత్యంత అమానుషమైందని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని అన్నారు.
బాలిక ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షించి, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గల్లా సత్య నారాయణ సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లారావు గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర నేతలు పమ్మి అనిత, మంద సరస్వతి, మణి, మల్లేశ్వరి, వల్లల రమేష్, అల్లిక అంజయ్య, రవి రాథోడ్, రవి గౌడ్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.



