మండల పరిధిలోని నాగిరిపాడు పంచాయతీ ఎగువపల్లె గ్రామ అటవీ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువపల్లె గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి శవం పడి ఉన్నట్లు స్థానికులు గమనించారు.
-పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో శవం:
మృతుడి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో ఉండటంతో ముఖం అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. మృతుడి శరీరంపై కేవలం లేత సిమెంట్ రంగు ప్యాంటు మాత్రమే ఉంది. ప్రాథమిక విచారణను బట్టి సదరు వ్యక్తి సుమారు 3 నుండి 4 రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హతమార్చి ఇక్కడ పడేశారా? అనే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
-పోలీసుల దర్యాప్తు – సీఐ పరిశీలన:
ఈ ఘోర ఉదంతంపై స్థానిక నాగిరిపాడు వీఆర్వో ఉదయ్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు చిట్వేల్ పోలీసులు బిఎన్ఎస్ఎస్ (194 BNSS) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) డి. శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం, ఇతర అధికారులకు దర్యాప్తుపై తగిన సూచనలు చేశారు. మృతుడి గుర్తింపు సాధించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
-పోలీస్ శాఖ విజ్ఞప్తి:
ఇటీవలి కాలంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా 30 నుండి 35 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఎవరైనా కనిపించకుండా పోయి ఉంటే (మిస్సింగ్ కేస్) లేదా ఈ మృతదేహానికి సంబంధించి ఎలాంటి చిన్న సమాచారం తెలిసినా.. బాధ్యతాయుత పౌరులుగా తక్షణమే చిట్వేల్ పోలీస్ స్టేషన్ను గానీ, కోడూరు రూరల్ పోలీస్ అధికారులను గానీ సంప్రదించాలని సీఐ డి. శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


