నెల్లూరు / ఆత్మకూరు జూన్ 9 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యాత్రికుల భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు. మృతదేహాల తరలింపునకు సంబంధించిన తాజా వివరాలను ఆయన మంగళవారం వెల్లడించారు.ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యాత్రికుల మృతదేహాలను ఔరంగాబాద్ నుంచి ముందుగా పాట్నాకు తరలించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఇండిగో విమానం 6E-619 ద్వారా హైదరాబాద్కు, అక్కడి నుంచి ఇండిగో విమానం 6E-6174 ద్వారా చెన్నైకి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విమానం మంగళవారం రాత్రి 10.05 గంటలకు చెన్నై టెర్మినల్-1కు చేరుకోనుందని వెల్లడించారు.మృతదేహాలతో పాటు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న సోమా పెంచల ప్రసాద్ ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించి, అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా సురక్షితంగా నెల్లూరు జిల్లాకు తరలించి సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన యాత్రికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియను కూడా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు.అలాగే న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక జిల్లా యంత్రాంగం, వైద్య అధికారులు మరియు బాధిత కుటుంబ సభ్యులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రమాదానికి గురైన ప్రతి యాత్రికుడు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.


