*బెల్ట్ షాపులకు ఎక్సైజ్ అధికారుల అండ..?*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా
గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా, మధిర మండల గ్రామాల్లో
ఎలాంటి అనుమతులు
లేకుండానే బహిరంగంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు నిర్బంధం లేకుండా బెల్ట్ షాపులు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాల కారణంగా యువత మద్యానికి బానిసవుతోందని, పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని గ్రామాలలో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకుని గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


