ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ఇంచార్జి )
ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న నిల్వల ప్రక్రియను జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన మొక్కజొన్నను గోదాములకు తరలిస్తున్న రవాణా ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మిర్చి, పత్తి మార్కెట్లలో మొక్కజొన్న నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు మొక్కజొన్న తరలింపును వేగవంతం చేయాలని సూచించారు.
నిల్వ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, కొనుగోలు–రవాణా–నిల్వ వ్యవస్థలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా గోదాముల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించి, మొక్కజొన్న నిల్వ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.



