విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 13..(ప్రజాప్రతిభ)
కొత్తవలస, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), కొత్తవలసలో సివిల్ జడ్జి డాక్టర్ విజయచంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్టోర్లో ఉన్న ఆహార సరుకుల నాణ్యత, వాటి గడువు తేదీలను (ఎక్స్పైరీ డేట్లు) పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి, వంట నాణ్యత బాగుందని, భోజనం రుచికరంగా ఉందని అభినందించారు.
అనంతరం విద్యార్థులతో సమావేశమైన డాక్టర్ విజయచంద్ర వారికి పలు విలువైన సూచనలు చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని వివరించారు.
అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాఠశాలలో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా విద్యార్థులు స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ కే. విజయకుమారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.


