ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో గళం వినిపించకపోవడం సిగ్గుచేటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై మాట్లాడే ధైర్యం రాజకీయ నాయకుల్లో లేకపోవడాన్ని ఆయన ప్రశ్నిస్తూ, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.
కార్పొరేట్ మీడియా అమరావతి అంశాన్ని మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, ప్రత్యేక హోదా మరియు విభజన హామీలపై మౌనం పాటించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడని ప్రజాప్రతినిధులు ప్రజలకు న్యాయం చేయడం లేదని, వారి చర్యలు రాష్ట్ర భవిష్యత్తుకు హానికరమని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా సాధిస్తే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, కానీ రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అవసరమైతే ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడించే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాలు తమ హక్కుల కోసం కఠినంగా పోరాడుతున్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ప్రశ్నించని ఎంపీలను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.
ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, పలువురు ఆర్పిసి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

