-చిట్వేల్లో శుక్రవారం జనసేన కార్యక్రమం ప్రారంభం – ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన జరుగనున్న తొలి భేటీ
చిట్వేల్, నవంబర్ 27: పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించే లక్ష్యంతో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. చిట్వేల్ మండలంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
-ప్రజా సమస్యలకు నేరుగా పరిష్కారం
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం చిట్వేలిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన జరుగనుంది. ప్రజలకు ఎదురవుతున్న చిన్నా పెద్దా సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో జాప్యం లేకుండా, నేరుగా ప్రజా ప్రతినిధి వద్దే వినతి పత్రాలు అందజేసి పరిష్కారం పొందే వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ జనవాణి’ ముఖ్య ఉద్దేశమని జనసేన నాయకులు స్పష్టం చేశారు.గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వీధి వెలుతురు సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్, రైతు సంబంధిత ఇబ్బందులు వంటి ప్రజా సమస్యలను వెంటనే నమోదు చేసి, వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
-ప్రతినెలా జనవాణి
‘జనవాణి’ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే శ్రీధర్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటారనే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక్కరోజుకే పరిమితం చేయకుండా, ఇకముందు ప్రతి నెలా నియమితంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య దూరాన్ని తగ్గించి, పాలనలో పారదర్శకతను పెంచేందుకు జనసేన పార్టీ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


