భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలలను సందర్శించనున్నారు. నవంబర్ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు, నవంబర్ 21న ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షత వహించారు. సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ప్రజా రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


