చిట్వేల్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
చిట్వేల్ మండలంలోని సి.ఎం. రాచపల్లి, నేతివారిపల్లి గ్రామాల్లో మంగళవారం రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, రైతులు శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తే వ్యవసాయంలో ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు.భూసార పరీక్షల ఆధారంగా పంటలకు తగిన సేంద్రియ, పచ్చి రొట్ట ఎరువులు వినియోగిస్తే నేల ఆరోగ్యం కాపాడటంతో పాటు నాణ్యమైన పంటలు పండించవచ్చని ఆయన వివరించారు. నానో యూరియా, నానో డి.ఏ.పి. వాడకం ద్వారా ఎరువుల వృథా తగ్గుతుందని, జీవన ఎరువులైన రైజోబియం, అజోల్లా, అజోస్పిరిల్లుమ్ ద్వారా నత్రజని అందించి రసాయన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని తెలిపారు.అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఘన జీవామృతం, బీజామృతం వినియోగించడం ద్వారా రసాయన ఎరువుల ఖర్చు తగ్గి మంచి దిగుబడులు వస్తాయని రైతులకు వివరించారు. యూరియాను సమతుల్యం గా వినియోగించకపోతే చీడపీడలు అధికమవుతాయని హెచ్చరించారు.మండలంలో యూరియా కొరత లేదని, అవసరం మేర రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్లకు కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, అవసరానికి మించి నిల్వ చేయరాదని, అక్రమంగా నిల్వ చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సి.ఎం. రాచపల్లి సర్పంచ్ రవికుమార్ రాజు, నీటి సంఘం అధ్యక్షులు ధర్మయ్య, సురేష్ కుమార్ రాజు, రైతు సేవా కేంద్రం ఉద్యాన సహాయకులు లక్ష్మీనారాయణ, ప్రసాద్ నాయక్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.


