తల్లాడ,/ ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా.. హామీల అమలులో పూర్తిగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
నారాయణపురం నుంచి తల్లాడ రింగ్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, ఉద్యోగులకు పీఆర్సీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లో తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, తల్లాడ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని సండ్ర ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



