నాలుగు దశాబ్దాల ప్రజా ఉద్యమ ప్రస్థానానికి ముగింపు
పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల సంతాపం
వరికుంటపాడు, పున్నమి ప్రతినిధి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం నల్లబోతులవారిపల్లి కాలనీకి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ యనమల చిన్న పెంచలయ్య (79) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాల్లో చిన్న పెంచలయ్య చురుగ్గా పాల్గొన్నారు. జీవితాంతం సీపీఎం పార్టీలోనే కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తమ గ్రామానికి చెందిన బీసీ మహిళ రత్తమ్మపై లైంగిక దాడి, హత్య ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన రాజీలేని పోరాటం చేశారు. కామ్రేడ్ జక్కా వెంకయ్య, కామ్రేడ్ భానురాజు, కామ్రేడ్ చంద్ర రాజగోపాల్ తదితర సీనియర్ నాయకులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
చిన్న పెంచలయ్య మృతిపై సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి చంద్ర రాజగోపాల్, ప్రస్తుత జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీఐటీయూ నాయకుడు కటారి అజయ్కుమార్, ఉదయగిరి నియోజకవర్గ పార్టీ నాయకుడు కూడ రమణయ్య, ఓపీడీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా శివశంకర్, నాయకుడు గుంజి వెంకటప్రసాద్తోపాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

