వైభవంగా ”షణ్ముఖ శర్మ’కు ‘కొప్పరపు’ కవుల జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానం
-శ్రీ కొప్పరపు సోదర కవుల శతావధాన సౌందర్యం (శ్రీం) గ్రంధావిష్కరణ
-బ్రహ్మశ్రీ సామవేదంచే కొప్పరపు కవుల ‘దైవసంకల్పం’ కావ్యంపై ప్రవచనం
ప్రఖ్యాత ప్రవచనకారులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిష్ఠాత్మక కొప్పరపు కవుల జాతీయప్రతిభా పురస్కారం-2026 అందుకున్నారు. బుధవారం సాయంత్రం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో అంగరంగవైభవంగా జరిగిన కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవ వేడుకలో అతిథులుగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్, విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి అమెరికాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి తదితరుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరిగింది. ఈ మహత్తర సభాకార్యక్రమానికి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసంలో కొప్పరపుకవుల పద్యవేగం ధారం కృత్రిమ మేథ సాయంతో లభ్యమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చే మాశర్మ కల నిజం కావాలని ఆకాంక్షించారు. గోదావరి పుట్టుక పై బేతవోలు వినిపించిన పద్యాన్ని షణ్ముఖశర్మ సారస్వతానికి అన్వయించిన తీరు బావుంది. తెలుగు భాషకే సొంతమైన అవధాన విద్యకు ఆద్యులు, అగ్రగణ్యులు, ఆశుకవితా సార్వభౌములు కొప్పరపుసోదర కవులు (కొప్పరపువేంకట సుబ్బరాయకవి 1885-1932), కొప్పరపు వేంకటరమణకవి 1887-1942) దివ్యస్మృతిలో గత 24 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఏటాటా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్న తీరును కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ శర్మ(మాశర్మ) తన అధ్యక్షోపన్యాసంలో వివరించారు. ఆదిశంకరాచార్యులు రామకష్ణ పరమహంస కందుకూరి శివానందమూర్తి తదితర పురుపుంగవులతో సామవేదం షణ్ముఖశర్మను పోల్చారు. శ్రీ కొప్పరపు సోదర కవుల విరచిత శతావధాన సౌందర్యం(శ్రీం) గ్రంధావిష్కరణ ఒక విశేషణం ఐతే ఆ గ్రంధం వెలువరించడానికి నిధులు సమకూర్చడం, తొలి ప్రతిని స్వీకరించడానికి అమెరికాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి విచ్చేయడం వారి సహృదయతకు నిదర్శనం అన్నారు మా శర్మ. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు కొపరపు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానంతోపాటు ఒక గంట నిడివిలో ‘దైవ సంకల్పం’ అనే అంశంపై సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం ఆబాలగోపాలాన్నీ కట్టిపడేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఉత్సవ క్రతువును శోభాయమానంగా తీర్చి దిద్దింది. పురస్కార ప్రదాన సందర్భంగా ఎప్పటిలాగే మా శర్మ ప్రణమిల్లి పురస్కార స్వీకర్తను గౌరవించడం, అనర్గళంగా కొప్పరపు సోదర కవుల పద్యాలను ఆలపించిన విధానం సభాసదుల మన్ననలందుకుంది.
సభ ప్రారంభానికి ముందు ఘోరకవి సంపత్ కుమార్ చే నారాయణ తీర్థుల తరంగ గానం, కొద్దిసేపు ఆలమూరు రాధాకుమారి చే కొప్పరపు కవుల విరచిత నీలాంభుజారామ కేళీ మరాళమై…, పరమ సుస్తుతి రాఘ్రు కాయా … , శారదాభ్రపటీ రహీ ర హ | సురాపరాసర గాగ …. హరియన్నన్ పరుడన్నా బ్రహ్మమయన్న….తదితర పద్య గాన కచేరీ వీనులవిందుగా సాగాయి. వాయులీనం పై డాక్టర్ మావుడూరి సత్యనారాయణ, మృదంగంపై మావుడూరి సూర్యప్రకాశ శర్మ ఈ పద్యక చేరీకి చక్కటి వాద్య సహకారం అందించి కచేరీని రక్తికట్టించారు. భారతీభూషణ రాంభట్ల నృసింహశర్మ సభావ్యాఖ్యాతగా వ్యవహరించారు. విశేష సంఖ్యలో హాజరైన కళా, సాహితీ ప్రియులతో కళాభారతి ప్రాంగణం విశిష్ఠ శోభను సంతరించుకొంది.


