సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళి
కొత్తపల్లి: తెలంగాణ వీరత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ప్రజా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కాలె అనిత–రమేష్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన పాపన్న గౌడ్ తనలోని ధైర్యసాహసాలను నమ్ముకుని ప్రజలను ఏకం చేసి అప్పటి మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. బలహీన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజలకు అండగా నిలిచి వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, ప్రజా సంక్షేమ దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో అసమానతలు తొలగి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించేలా కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్రలో పాపన్న గౌడ్ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి జయంతి శుభాకాంక్షలతో ఘన నివాళులు అర్పిస్తున్నట్లు కాలె అనిత–రమేష్ తెలిపారు.
కాలె అనిత–రమేష్
కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్



