నంద్యాల: శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.ఈ సందర్భంగా అమ్మవారిని 13 పట్టుచీరలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఆలయ మండపాలు, స్తంభాలు తదితర ప్రాంతాలను కలిపి సుమారు 100 చీరలతో సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల చీరల అలంకరణతో అమ్మవారి సన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువైన శ్రీ కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.



