గుంటూరులో నిర్వహించిన ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఉపాధి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. యువత కేవలం సర్టిఫికెట్లపై కాకుండా నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్ రంగాల్లో నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, జాతీయ రహదారుల విస్తరణ వంటి రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వివరించారు. ఉపాధి అవకాశాల పెంపు ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.


