పున్నమి ప్రతినిధి
కడప, సెప్టెంబర్ 16
రెండు రోజుల గడువు సరిపోదు.. పెన్షన్ దరఖాస్తులకు 15 రోజులు ఇవ్వాలి
అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి.. నిబంధనలను సడలించాలి
— సయ్యద్ గౌస్ పీర్, కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు
కడప నగర కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్, కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రెండు రోజుల గడువు సరిపోదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ కోసం 365 రోజుల ఆన్లైన్ అవకాశం కల్పించాలని, ఒంటరి మహిళలకు 35 ఏళ్ల నుంచే పెన్షన్ ఇవ్వాలని కోరారు. వితంతువులకు కుటుంబ విభజనతో సంబంధం లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని, ప్రస్తుతం ఉన్న 30 వేల పెన్షన్ల కోటాను పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పెన్షన్లు అందించిన విధానాన్ని గౌస్ పీర్ గుర్తుచేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి, కడప నగరంలో కాంగ్రెస్ మేయర్తో పాటు మెజారిటీ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే పాలనతోనే రాజన్న రాజ్యం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లగలం” అని గౌస్ పీర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు సౌదాగర్ సాదిక్, అంజన్ కుమార్, డివిజన్ ఇంచార్జిలు షేక్ అన్వర్, మహబూబ్ బాషా, సయ్యద్ అన్వర్, గఫార్, మురాద్ భాష, హమీద ఖానమ్, షేక్ సాదిక్, సుబ్రహ్మణ్యం, ఆరిఫ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





