ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంపై విచారణ జరపాలి
చర్యలు లేకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా: సీపీఐ
చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీఆర్వో ఉదయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల నాయకులు తిప్పన ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం చిట్వేలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలపల్లి పంచాయతీ పరిధిలోని 490/2 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి విషయంలో కబ్జా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై వీఆర్వోకు పలుమార్లు సమాచారం ఇచ్చినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భూమికి సంబంధించిన పత్రాలపై కూడా అనుమానాలు ఉన్నాయని, అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్వోపై వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, తప్పులు నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే మైలపల్లి పంచాయతీ ప్రజలను కలుపుకుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తిప్పన ప్రసాద్ హెచ్చరించారు.


