మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు నిరసనగా నేడు ఆందోళన
కడప, జూలై 21: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, లైంగిక వేధింపుల ఘటనలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
నూతన బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు టి.పి. వెంకటసుబ్బమ్మ, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న మహిళలపై దాడులు, అఘాయిత్యాల ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, సీఈసీ సభ్యుడు కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


