తిరుపతి రూరల్, సెప్టెంబర్ 02, పున్నమి ప్రతినిధి
మరపురాని మహానేత, జలప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తిరుపతి రూరల్ మండల ఎంపీపీ విడుదల మాధవరెడ్డి అన్నారు. వైఎస్సార్ తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదని, కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరినిచ్చిన మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. కాలువల ద్వారా జలసిరులు పారించి కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్ అని కొనియాడారు. నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాతకు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ విడుదల మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిన వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. వైఎస్సార్ అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రవికుమార్రెడ్డి, మాజీ సర్పంచ్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, గోపాల్రెడ్డి, మునికృష్ణారెడ్డి, గోవర్ధన్రెడ్డి, సుధ, తేజ, ప్రసాద్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


