దేశ సరిహద్దుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రణాళికను త్వరలో అమలు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దులను చొరబాట్లకు అవకాశం లేకుండా మార్చడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికట్టడమే కాకుండా ఇప్పటికే దేశంలోకి వచ్చిన చొరబాటుదారులను కూడా గుర్తించి బయటకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు, డ్రోన్లు, సెన్సార్ వ్యవస్థలు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
దేశ భద్రతకు సరిహద్దు పరిరక్షణ అత్యంత కీలకమని అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ వలసల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనాభా అసమతుల్యత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రణాళిక అమలుతో దేశ భద్రత మరింత బలపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


