ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అమలును జిల్లా స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ప్లానింగ్ (V) శాఖ 2026 జూన్ 18న మెమో నెం. 316/Plg.V/2026 జారీ చేసింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, వివిధ శాఖల పనితీరు, ఉత్తమ విధానాల నమోదు, ఎదురవుతున్న సమస్యలు, తదుపరి చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా అనుదీప్ దూరి శెట్టిని ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక అధికారులు జిల్లా పర్యటనలు నిర్వహించి, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలు తీరును పరిశీలించడంతో పాటు, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నారు.
ఈ చర్య ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం కావడంతో పాటు, జిల్లాల్లో పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.



