*పేదల సన్న బియ్యానికి ప్రైవేట్ హాస్టళ్ల లో గిరాకీ*
*కిలో రూ.15కు గ్రామాల నుంచి కొనుగోళ్లు? — పట్టించుకోని అధికార యంత్రాంగం*
*విద్యార్థులకు పౌష్టికాహారం ఎక్కడ? తల్లిదండ్రుల్లో ఆందోళన*
*రేషన్ డీలర్ల హస్తం ఉన్నట్టు ఆరోపణలు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం :
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రభుత్వ పథకం కింద లభించే సన్నబియ్యాన్ని కొందరు వ్యక్తులు కిలోకు సుమారు రూ.15 చొప్పున కొనుగోలు చేసి ప్రైవేట్ హాస్టళ్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనంతరం అదే బియ్యాన్ని ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులకు వండి పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*పౌష్టికాహారానికి బదులు సన్నబియ్యమేనా?*
ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, సమతుల్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా ప్రభుత్వ ఉచిత బియ్యం పథకం ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యం ప్రైవేట్ హాస్టళ్లకు చేరితే, అసలు పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని పలువురు పేర్కొంటున్నారు.
*తనిఖీలు శూన్యం*
జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ హాస్టళ్లపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు నామమాత్రంగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హాస్టళ్లలో ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న మెనూ, బియ్యం కొనుగోలు వివరాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
*ప్రశ్నిస్తే పిల్లల చదువుపై ప్రభావం పడుతుందనే భయం*
తమ పిల్లలకు హాస్టల్లో భోజనం సరిగా అందడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించాలనుకున్నా, యాజమాన్యాన్ని నిలదీస్తే తమ పిల్లల చదువుపై ఎక్కడైనా ప్రభావం పడుతుందేమోనన్న భయంతో వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఉందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సమస్య తెలిసినా నోరు మెదపలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వారు చెబుతున్నారు.
*కలెక్టర్ సాబ్ ప్రత్యేక దృష్టి సారించాలి*
ప్రభుత్వ పథకం ద్వారా పేదలకు ఉచితంగా అందాల్సిన సన్నబియ్యం అక్రమంగా ప్రైవేట్ హాస్టళ్లకు తరలిస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలోని ప్రైవేట్ హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి, బియ్యం నిల్వలు, కొనుగోలు వివరాలు, సరఫరా మార్గాలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ సన్నబియ్యం పక్కదారి పడకుండా కట్టడి చేయడంతో పాటు ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
*ప్రైవేట్ హాస్టళ్లలో ఆహారం వృథా*
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం కారణంగా వండిన భోజనం డస్ట్బిన్లకే పరిమితమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల కోసం వండుతున్న ఆహారం రుచికరంగా లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చాలామంది విద్యార్థులు భోజనం చేయకుండా వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా వండిన అన్నం, కూరలు, ఇతర ఆహార పదార్థాలను డ్రమ్ముల్లో వేసి పారవేస్తున్న దృశ్యాలు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా హాస్టల్ ఫీజులు చెల్లిస్తుండగా, మరోవైపు ఆహారం వృథా అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాలల నిర్వహణపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


