భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (GDC Bhainsa)కు చెందిన లెక్చరర్ గుంత సుధాకర్ గారు ఆర్థిక బాధ్యత చట్టం మరియు ఆర్థిక లోటు ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం అనే అంశంపై పరిశోధన చేసి సమగ్ర నివేదిక తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమర్పించగా సంతృప్తి చెంది డాక్టరేట్ (Ph.D) పట్టా పొందిన సందర్భంగా కళాశాలలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పరిశోధనను రిజిస్ట్రార్ డా. యాదగిరి గారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ గారు మాట్లాడుతూ, గుంత సుధాకర్ గారి పట్టుదల, కృషి మరియు విద్యాపట్ల అంకితభావం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. యు. రవి కుమార్ గారు మాట్లాడుతూ, ఆయన సాధించిన ఈ ఘనత కళాశాల ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
సీనియర్ అధ్యాపకులు డా. భీమరావు, డా. పవన్ కుమార్, డా. ఎం. శంకర్, ఆర్. రాజు, డా. ఓంప్రకాశ్, డా. కె. సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని గుంత సుధాకర్ గారిని పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


