ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్/ పువ్వాడ నాగేంద్ర కుమార్ )
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
ఇటీవల జిల్లాలో గంజాయి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా మార్గాలు, విక్రయ కేంద్రాలు, వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి లేదా మత్తు పదార్థాలతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాటి మూలాలను గుర్తించి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఛేదించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నవరపేట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించగా, ఒకరిని అదుపులోకి తీసుకుని, మరొకరు పరారయ్యారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి సుమారు 40 గ్రాముల ఎండు గంజాయి, ప్లాస్టిక్ సీసాలు, రోల్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి సేవిస్తున్న మరికొందరిని గుర్తించి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉన్న వారు పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


