ప్రభుత్వ భూములకు రక్షణగా హెచ్చరిక బోర్డులు
రెళ్లి రెవెన్యూలో సర్వే నంబర్146 లో రెవెన్యూ శాఖ చర్యలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 07.( పున్నమి ప్రతినిధి )
శృంగవరపుకోట మండలం కొత్తవలస పంచాయతీ రెళ్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 146లో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. గతంలో ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన 5 ఎకరాల 36 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్న అధికారులు, తాజాగా అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భూములను ఎవరూ ఆక్రమించరాదని, అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డుల ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని రెవెన్యూ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ భూములపై ఎవరైనా అక్రమంగా కన్నేస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.



