ఆత్మకూరులో సిపిఎం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి)
ప్రజా ఉద్యమాలకు ప్రాణం పోసిన మహానేత, కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం “కామ్రేడ్ సుందరయ్య అమర్ రహే”, “సుందరయ్య జోహార్” అంటూ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా సుందరయ్య చిత్రపటానికి పూలాభిషేకం చేసి తమ నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్టణ ప్రజలు, ప్రయాణికులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని చల్లని మజ్జిగను సేవించారు. సిపిఎం కార్యకర్తలు ప్రజలకు స్వయంగా మజ్జిగ అందిస్తూ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చాలా కాలం క్రితమే సుందరయ్య విశ్లేషించారని, ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
సామాన్య ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాట పంథాలో ముందుకు సాగాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, ఆవాజ్ నాయకులు యస్దాని, సీఐటీయూ నాయకులు నాగయ్య, ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, హాజరతయ్య, గద్దర్ బాబు, పద్మ, రమణయ్య, సాదిక్ హుస్సేన్, ఐ.వి. రమణారెడ్డి, ఎన్ఆర్ఐ మీరా మహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ప్రజలు సిపిఎం నాయకత్వాన్ని అభినందించారు.


