48 గంటల్లో ఎరువులు పొందే అవకాశం.. అన్ని కేటగిరీల రైతులకు అవకాశం
మంథని, ఆగస్టు 31:
ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సులభతరం చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన అన్ని రకాల ఎరువులను ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని మంథని మండల వ్యవసాయ అధికారి డాక్టర్ దాసరి నవ్య తెలిపారు. నమోదు చేసుకున్న రైతులకు 48 గంటల్లో ఎరువులు అందేలా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాదారు రైతులతో పాటు మరణించిన పట్టాదారుల వారసత్వం నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, అటవీ హక్కుల పట్టాలు కలిగిన వారు, పోడు భూములు, దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ, సంస్థలు, సామాజిక భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఆధార్, ఫోన్ నంబర్ ధ్రువీకరణ, అనంతరం భూమి వివరాలు నమోదు చేసేటప్పుడు సంబంధిత కేటగిరీని ఎంపిక చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఉన్న రైతులు, చట్టపరమైన వారసులు, యజమానులుగా ఉండి భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నవీకరించబడని రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. భూమి వివరాలు నమోదు కాని రైతులు ‘భూమిని జోడించు’ ఎంపిక ద్వారా సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్, విస్తీర్ణాన్ని నమోదు చేస్తే సంబంధిత వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తుందని తెలిపారు. అధికారి ఆమోదం పొందిన తర్వాత ఎరువులను నమోదు చేసుకుని పొందవచ్చన్నారు. రైతులకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువులు నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఎరువుల విక్రయదారులు సహకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, రైతులు ఎరువుల లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ దాసరి నవ్య పేర్కొన్నారు.


