ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ జూనియర్, కళాశాలల్లో విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస మౌలిక వసతులు కల్పించడంలో అనేక విద్యాసంస్థలు విఫలమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతకు అత్యంత కీలకమైన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడం, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు, ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాల వంటి ప్రాథమిక వసతులు కూడా కొన్ని చోట్ల నాసిరకంగా ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ అనుమతులు, భవన భద్రతా ప్రమాణాలు, ఇతర అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ, సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థల్లో జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల భద్రతపై ప్రశ్నలు మరింత తీవ్రంగా మారాయి. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్న తల్లిదండ్రులను కలవరపెడుతోంది.
విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశంలో అధికారులు నిర్లక్ష్యం వీడి, జిల్లాలోని అన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, మౌలిక వసతులు, ఫీజుల నియంత్రణపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.



